Telugu Moral Stories for Kids 13- Musalamma Bangaru Moota

ముసలమ్మ-బంగారుముట 




అనగనగ వెంకటాపురం అనే గ్రామంలో విశ్వనాధం అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. అతను చుటుపక్కన ఉన్న పిల్లలకు చదువు చెప్పి వారు ఇచ్చే గురుదక్షిణతో జీవనం సాగించేవాడు. ఒక ఏడాది అతనికి పిల్లలు ఇచ్చిన గురు దక్షిణలో తన ఖర్చులు పోగా వెయ్యి వరహాలు మిగిలాయి. ఆ వెయ్యి వరహాలు ఎక్కడైనా దాచిపెట్టి కాశీ యాత్రకు వెళదాము అనుకున్నాడు విశ్వనాధం. తన ఇంట్లో దాస్తే భద్రత ఉండదని ఆ వూరిలో నెయ్యి వ్యాపారం చేసే సుబ్బిశెట్టి దగ్గరకు వెళ్ళాడు. విశ్వనాధం సుబ్బిశెట్టితో "నేను కాశీ యాత్రకు వెళ్ళాలి అనుకుంటున్నాను. అయితే నా దగ్గర వెయ్యి వరహాల సొమ్ము వుంది. దానిని నీదగ్గర దాచిపెడదాం అనుకుంటున్నాను." అని చెప్పాడు. దానికి సుబ్బిశెట్టి "అయ్యా ! డబ్బు చాలా పాపిష్టిది దానివల్ల గొడవలు వస్తాయి. నేను మీ డబ్బును భద్రపరచలేను." అని చెప్పాడు. అదే సమయంలో ఒక వ్యక్తి సుబ్బిశెట్టి దుకాణంలో ఒక సేరు నెయ్యి కొనుగోలు చేసాడు. సుబ్బిశెట్టి సహాయకుడు శాంతయ్య సేరు నెయ్యి కొలిచి పోసి డబ్బు తీసుకున్నాడు. సుబ్బిశెట్టి శాంతయ్యను ఎంత డబ్బు తీసుకున్నావని ప్రశ్నించగా పది వరహాలు తీసుకున్నానని చెప్పాడు. దానికి సుబ్బిశెట్టి నువ్వు ఎనిమిది వరహాలు మాత్రమే తీసుకోవాలి రెండు వరహాలు ఎక్కువ తీసుకున్నావు. వాటిని ఆయనకి వెనక్కి ఇచ్చేయమని మందలించగా శాంతయ్య ఆ పని చేసాడు.


ఇది గమనించిన విశ్వనాధం సుబ్బిశెట్టి నిజాయతీకి ముగ్దుడై "శెట్టి ! నీ మీద నాకు ఎటువంటి అపనమ్మకం లేదు. నా డబ్బు నీ దగ్గరే భద్రంగా ఉంటుంది. నువ్వు మాట్లాడకుండా నా డబ్బును భద్రపరుచు. నేను యాత్ర ముగించుకున్న తరువాత ఆ డబ్బును తీసుకుంటాను." అని చెప్పాడు. దానికి సుబ్బిశెట్టి "మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి మీరే నా పెరటిలో మీకిష్టం వచ్చిన చోట ఆ డబ్బును భూమిలో దాచి ఏదైనా గుర్తు పెట్టండి." అన్నాడు. అప్పుడు విశ్వనాధం అలాగే అని చెప్పి మామిడి చెట్టు కింద తన వెయ్యి వరహాలు దాచి కాశీ యాత్రకు బయలుదేరాడు.కొన్నాళ్ల తరువాత తన యాత్ర ముగించుకుని తిరిగి వచ్చాడు. ఒక రోజు సుబ్బిశెట్టి ఇంటికి వెళ్లి తన డబ్బును తీసుకుంటానని చెప్పాడు. దాని సుబ్బిశెట్టి "అయ్యా మీ డబ్బు మీరు నిరభ్యంతరంగా తీసుకుని వెళ్ళండి" అని అన్నాడు. అప్పుడు విశ్వనాధం మామిడి చెట్టు క్రింద తవ్వి చూసాడు కానీ అక్కడ డబ్బు కనపడలేదు. సుబ్బిశెట్టిని ప్రశ్నించగా "అయ్యా! నేను ముందే చెప్పను ఇలాంటి మాట వస్తుందని, మీరు సరిగా గుర్తు తెచ్చుకోండి ఎక్కడ పెట్టారో. మీ డబ్బు ఎక్కడికి పోదు" అన్నాడు. సుబ్బిశెట్టి తనని నమ్మించి మోసం చేసాడని గ్రహించాడు విశ్వనాధం. కానీ ఏమి చేయలేక తనని తాను నిందించుకుంటూ ఇంటికి బయలుదేరాడు.

దారిలో అతనికి శేషమ్మ అనే అవ్వ కనపడింది. ఆమె చాలా తెలివైనదే కాకుండా ఎంతో అనుభవం ఉన్నది. విశ్వనాధాన్ని చూసి " ఏంట్రా అబ్బాయి! అలా దిగులుగా ఉన్నావు?" అని అడిగింది. విశ్వనాధం సుబ్బిశెట్టి తనని నమ్మించి ఎలా మోసం చేసాడో శేషమ్మవ్వకు చెప్పాడు. అప్పుడు శేషమ్మ "నువ్వేమి దిగులుపడకురా అబ్బాయి! మోసాన్ని మోసంతోనే జయించాలి. ఆ సుబ్బిశెట్టికి బుద్ధి చెప్పి నీ డబ్బులు దక్కేలా చేస్తాను " అని ధైర్యం చెప్పింది. తరువాత ఒక పథకం ప్రకారం ఒక బంగారు నగల మూటను తీసుకుని సుబ్బిశెట్టి దగ్గరకు వెళ్ళింది. సుబ్బిశెట్టితో శేషమ్మ "నా మనవడు కాశీలో చదువుతున్నాడు. వాడిని చూడడానికి వెళ్ళాలి. నా నగలని నీ వద్ద భద్రపరచడానికి వచ్చాను" అని చెప్పింది. దానికి సుబ్బిశెట్టి విశ్వనాధంతో చెప్పినట్టే శేషమ్మతో కూడా తన పెరటిలో తోచిన చోట నగలను దాచుకోమని చెప్పాడు. ఈ లోపు విశ్వనాధం ఏమి తెలియని వాడిలా సుబ్బిశెట్టి వద్దకు వచ్చి "నేను ఆ రోజు మరచిపోయి మామిడి చెట్టు కింద నా డబ్బు వెతికాను. కానీ చింత చెట్టు క్రింద ఉందేమో అని అనుమానంగా ఉంది" అన్నాడు.


అప్పుడు శేషమ్మ విశ్వనాధంతో "నీ డబ్బేమైన పోయిందేమిటిరా అబ్బాయి?" అని అడిగింది. విషయం తెలిస్తే నగలు తన దగ్గర ఉంచదేమోనని అనుకున్న సుబ్బిశెట్టి కల్పించుకుని "అయ్యా విశ్వనాధం ! మీరు ఆ రోజు వెళ్లిన తరువాత నేను ఇంకో అడుగు తవ్వి చూస్తే నాకు మీ వెయ్యి వరహాలు దొరికాయి. నేనే మీకు కబురు చేద్దాం అనుకుంటున్నాను" అని చెప్పి ఆ మూట లోపలనుండి తీసుకువచ్చి విశ్వనాధానికి ఇచ్చేసాడు. అప్పుడు శేషమ్మ విశ్వనాధంతో "అబ్బాయి! నువ్వు కాశీ వెళ్ళావా ? అక్కడ నా మనవడు ఏమైనా కనపడ్డాడా? ఎలా ఉన్నాడు ?" అని అడిగింది. దానికి విశ్వనాధం "వాడికే నిక్షేపంలా ఉన్నాడు ఇంకో వారంలో చదువు పూర్తవుతుంది బయల్దేరి వచ్చేస్తున్నాడు." అని చెప్పాడు. అప్పుడు శేషమ్మ "అలాగా ! ఇదిగో సుబ్బిశెట్టి నా మనవడు వచ్చే వారం వచ్చేస్తున్నాడట నేను ఇంకా దేనికి కాశీకి వెళ్లడం. ఇంటికి వెళ్తున్నా మరి!" అని చెప్పి వెళ్ళిపోయింది విశ్వనాధంతో పాటు. సుబ్బిశెట్టికి నోట మాటరాలేదు. విశ్వనాధం శేషమ్మ అవ్వకి ఎన్నో విధాలుగా కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు.

For More Telugu Moral Stories Click Here

Comments