బంగారు ఎలుక
అనగనగ భీమవరం అనే పట్టణంలో ఒక వ్యాపారి నివసించేవాడు. తన వ్యాపారం బాగా అభివృద్ధి చేసి అతడు ఎంతో డబ్బు సంపాదించి సుఖంగా జీవించసాగాడు. ఇదిలా ఉండగా ఒకసారి తీవ్రమైన జబ్బు చేసి వ్యాపారి మరణించాడు. ఆ వ్యాపారి భార్య, భర్త అకాల మరణానికి ఎంతగానో దుఃఖించింది. ఆ సమయానికి ఆమె గర్భవతి. భర్త సమీప బంధువులందరూ అతను చనిపోయిన వెంటనే మొత్తం ఆస్తిని కాజేశారు. దానితో ఏమి చేయాలో పాలుపోక ఆ వ్యాపారి భార్య విలపించింది. కొంత కాలానికి ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. తాను కటిక పేదరికం అనుభవిస్తున్నా కష్టపడి తన కొడుకుని పెంచసాగింది. ఎప్పటికైనా తన బిడ్డ బాగా ధనవంతుడవ్వాలని ఆ పిల్లవాడికి కోటీశ్వరుడు అని పేరు పెట్టి భగవంతుని నిత్యం ప్రార్థించేది. కొడుకుని కోటి అని పిలుచుకుని మురిసిపోయేది. కోటి పెద్దవాడయ్యాక ఒక రోజు జరిగిన విషయం అంతా చెప్పింది. ఇదంతా విన్న కోటి తాను కూడా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తానని ఆమెతో చెప్పగా పెట్టుబడి కోసం ఆ ఊరిలో ఉన్న పెద్ద వ్యాపారి ధనగుప్తుని వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చింది. ధనగుప్తుడు కొత్త వ్యాపారులకు డబ్బు ఇచ్చి సహాయం చేస్తాడని పేరు ఉంది.
కోటి ఒక మంచి ముహూర్తం చూసుకుని ధనగుప్తుని దగ్గరకు వెళ్ళాడు. కోటి వెళ్లిన సమయంలో ధనగుప్తుడు ఒక యువకుడిని తీవ్రంగా మందలిస్తున్నాడు. ధనగుప్తుడు ఆ యువకుడిని "నీకు వ్యాపార దక్షత లేదు. నేను నీకు ఎన్ని సార్లు ధన సహాయం చేసినా నువ్వు ఆ డబ్బుని వృధా చేస్తున్నావు. నీకు నిజంగా డబ్బు సంపాదించాలని ధృడ నిశ్చయం ఉంటే చచ్చిన ఎలుకని కూడా పెట్టుబడిగా చేసుకుని కోట్లు సంపాదించవచ్చు." అని దూరంగా చచ్చిపడివున్న ఎలుకని చూపించాడు. ధనగుప్తుని మాటలకు కోటి తాను వచ్చిన పని పక్కన పెట్టి ఆ చచ్చిన ఎలుకని తీసుకుని వెళ్లిపోయాడు. దానిని తీసుకుని వెళ్లి ఆ ఊరిలో ఉన్న ఒక షావుకారి పెంపుడు పిల్లికి ఆహారంగా ఇచ్చాడు. దానికి సంతోషించిన షావుకారు కోటికి రెండు దోశల సెనగలు ఇచ్చాడు. కోటి ఆ సెనగలు తీసుకుని వాటిని ఉడకబెట్టి తాళింపు వేసి కారం సెనగలు తయారుచేసాడు. ఆ కారం సెనగలు, ఒక నీటి కుండ తీసుకుని ఊరి చివర ఉన్న వేప చెట్టు కింద కూర్చున్నాడు. ప్రతిరోజూ అక్కడ కట్టెలు కొట్టడానికి వచ్చే కూలీలు ఆ చెట్టు క్రింద అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటారు.